: వాటాలమ్మేందుకు సిద్ధంగా ఉన్న 33 ఎస్ఎంఈలు!

వ్యాపార విస్తరణ ప్రణాళికల అమలుతో పాటు, మూలధన నిల్వలను పెంచుకునే లక్ష్యంతో సమీప భవిష్యత్తులో 33 చిన్న, మధ్య తరహా కంపెనీలు తమ వాటాలను విక్రయించేందుకు నిర్ణయించాయి. ఈ కంపెనీలన్నీ ఐపీఓకు రావాలన్న ఆలోచనతో బీఎస్ఈ ముందు క్యూ కట్టడంతో, సమీప భవిష్యత్తులో ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లు వెల్లువలా మార్కెట్ ను తాకనున్నాయి. ఇప్పటికే 15 ఎస్ఎంఈ కంపెనీలకు బీఎస్ఈ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మరో 18 కంపెనీలు తమ ముసాయిదాను సమర్పించి, తుది అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఐపీఓకు రానున్న ఎస్ఎంఈల్లో ట్రైనీ ఎంటర్ టెయిన్ మెంట్ం మోనార్క్ అపెరల్స్, షేర్ వే సెక్యూరిటీస్, ఆక్టా వేర్ టెక్నాలజీస్, వర్త్ ఇన్ ఫ్రా ఇండస్ట్రీస్, ఏజీఐ హాస్పిటల్స్, యస్ చీమెక్స్, అడ్వాన్స్ సింటెక్స్ తదితర కంపెనీలు ఉన్నయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో 30 వరకూ సంస్థల ఐపీఓలు మార్కెట్ ముందు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయని బీఎస్ఈ ఎండీ ఆశిష్ కుమార్ చౌహాన్ అంచనా వేశారు. 2012లో ఎస్ఎంఈ ప్లాట్ ఫాంను ప్రారంభించిన తరువాత 139 కంపెనీలు వాటాలను విక్రయించి, మొత్తం రూ. 10,126.35 కోట్లను సమీకరించాయని ఆయన గుర్తు చేశారు. కాగా, బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ ఫాంపై లిస్టింగ్ కావాలంటే, కనీసం రూ. 3 కోట్ల పెయిడప్ కాపిటల్ ను సంస్థ నిర్వహించాల్సి వుంటుంది. దీనికి అదనంగా రూ. 3 కోట్ల నెట్ వర్త్ ను కలిగివుండాలి కూడా. ఆపై నిధుల సమీకరణ నిమిత్తం ప్రతిపాదనలు అందిస్తే, దానిపై బీఎస్ఈ విచారణ జరిపి నిబంధనలకు తగ్గట్టుగా సంస్థ నడుస్తోందని భావిస్తే, అనుమతిస్తుంది.

More Telugu News