: డానిష్ కనేరియాపై మండిపడ్డ పీసీబీ

తాను హిందువును కావడం వల్లే పీసీబీ తనకు సాయం చేయలేదన్న పాక్ క్రికెటర్ డానిష్ కనేరియా వ్యాఖ్యల్లో వాస్తవం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. పీసీబీలో అలాంటి విధానం ఉండి ఉంటే కనేరియాకు జట్టులో చోటుకూడా లభించి ఉండేది కాదని బోర్డు మీడియా డైరెక్టర్ అమ్జాద్ హుస్సేన్ తెలిపారు. కరాచీలో ఆయన మాట్లాడుతూ, కనేరియాను పీసీబీ నిషేధించలేదని తెలిపారు. కనేరియాను నిషేధించింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడుతున్న కనేరియా ఫిక్సింగ్ కు పాల్పడడంతో అతనిపై జీవితకాల నిషేధం విధించి, 2.5 కోట్ల రూపాయల జరిమానా విధించిందని ఆయన తెలిపారు. 'దీనిపై పోరాడడం మానేసి, పలు మ్యాచుల్లో అవకాశం కల్పించిన పీసీబీని విమర్శిస్తావా?' అని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కనేరియాను తాజా వ్యాఖ్యలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టేవే కావడం విశేషం.

More Telugu News