: మోకాలొడ్డేదేమీ లేదు... భారత్ ఎన్ఎస్జీ సభ్యత్వంపై మరింత మేర చర్చలు జరగాలంటున్న చైనా

అణు సరఫరాదారుల కూటమి (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం కోసం భారత్ చేసుకున్న దరఖాస్తు ఆమోదానికి దాదాపుగా అడ్డంకులన్నీ తొలగిపోయినట్లే కనిపిస్తోంది. మొన్న వియన్నాలో జరిగిన ఎన్ఎస్జీ భేటీలో భారత్ దరఖాస్తును చైనా వ్యతిరేకించింది. చైనా వాదనకు దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్, టర్కీ... తదితర దేశాలు మద్దతు పలికాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికా సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ భారత్ కు ఎన్ఎస్జీ సభ్యత్వం వాయిదా పడింది. ఈ నెల మరో దఫా సియోల్ లో జరిగే కూటమి భేటీలో భారత్ కు సభ్యత్వంపై తుది నిర్ణయం జరగనుంది. ఈ నేపథ్యంలో కూటమిలో భారత సభ్యత్వంపై నిన్న చైనా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఎన్ఎస్జీలో భారత్ కు సభ్యత్వానికి తమకేమీ అభ్యంతరం లేదని చెప్పిన చైనా... అయితే ఈ దిశగా మరింత మేర విస్తృత చర్చలు జరగాల్సి ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హాంగ్ లీ చెప్పారు. చైనా తన వ్యతిరేేకతను కాస్తంత తగ్గించిన నేపథ్యంలో ఎన్ఎస్జీలో భారత్ కు సభ్యత్వం దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది.

More Telugu News