: బ్రెయిన్ డెడ్ అయిన మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది!
బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన పోర్చుగల్ లిస్బన్లోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. గర్భంతో ఉన్న ఓ మహిళ బ్రెయిన్ డెడ్ అయ్యింది. నాలుగు నెలల శిశువు బ్రెయిన్ డెడ్ అయిన మహిళ కడుపులో పెరుగుతోందని గమనించిన వైద్యులు బిడ్డను బతికించే ప్రయత్నం చేస్తామని చెప్పి, ఆ క్రమంలో ఆమె భర్త నుంచి అంగీకారం తీసుకున్నారు. అనంతరం అనేక జాగ్రత్తలు తీసుకొని కడుపులో పెరుగుతోన్న శిశువును కాపాడారు. 16 వారాల పాటు తమ పర్యవేక్షణలో మహిళ కడుపులో బిడ్డ క్షేమంగా పెరిగేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. శిశువుకి 8 నెలలు నిండాక తల్లికి సిజేరియన్ ఆపరేషన్ చేసిన బిడ్డను బయటకు తీశారు. 2.35 కిలో గ్రాముల బరువుతో పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు. గతంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ గర్భిణీకి కడుపులో 55 రోజులు పెరిగిన ఓ శిశువును సిజేరియన్ ఆపరేషన్ చేసి తీశామని, ఈసారి బ్రెయిన్ డెడ్ అయిన మహిళ కడుపులో ఈ శిశువు ఏకంగా 16 వారాలు బతికిందని వైద్యులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.