: 25 శాతం వరకూ తగ్గిన 56 అతిముఖ్య ఔషధాల ధరలు

క్యాన్సర్ నుంచి మధుమేహం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, రక్తపోటు తదితర 56 రుగ్మతల నుంచి ఉపశమనం ఇచ్చే ఔషధాల ధరలు 25 శాతం మేరకు తగ్గనున్నాయి. ఔషధాల ధరలపై మోదీ సర్కారు అవధులను విధించాలని నిర్ణయించడమే ఇందుకు కారణం. ఇప్పటికే ఎన్పీపీఏ (నేషనల్ ఫార్మాస్యుటికల్ ప్రైసింగ్ అధారిటీ) ఇందుకు సంబంధించిన ముసాయిదా సిఫార్సులు సిద్ధం చేసింది. ఇదే సమయంలో గ్లూకోజ్, సోడియం క్లోరైడ్ ఇంజక్షన్లు వంటి వాటి ధరలను పెంచేందుకూ ప్రతిపాదించింది. దీనిపై త్వరలో నిర్ణయం వెలువడనుండగా, ఫార్మా దిగ్గజాలైన అబాట్ హెల్త్ కేర్, సిప్లా, లుపిన్, అలెంబిక్, ఆల్ కెమ్ ల్యాబొరేటరీస్, నోవార్టిస్, బయోకాన్, ఇంటాస్ ఫార్మా, హెటిరో హెల్త్ కేర్, రాన్ బాక్సీ (ఇప్పుడు సన్ ఫార్మా) తదితర కంపెనీలపై ప్రభావం పడనుందని నిపుణులు వ్యాఖ్యానించారు. "సరాసరిన 25 శాతం వరకూ ఔషధాల ధరలు తగ్గనున్నాయి. కొన్ని ఔషధాల ధరలు 10 నుంచి 15 శాతం, మరికొన్ని 45 నుంచి 50 శాతం వరకూ తగ్గుతాయి" అని ఎన్పీపీఏ చైర్మన్ భూపేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. 31 రకాల ఐవీ ఫ్లూయిడ్స్ ఫార్ములేషన్స్ ధరలు పెరగనున్నాయని కూడా ఆయన తెలిపారు.

More Telugu News