: లాభం లేదు, నష్టం లేదు... ఎటూ కదలని స్టాక్ మార్కెట్!

సెషన్ ఆరంభంలోని స్వల్ప లాభాలు, ఆపై వచ్చిన అమ్మకాల ఒత్తిడితో హరించుకుపోగా, బెంచ్ మార్క్ సూచికలు ఎటూ కదలకుండా క్రితం ముగింపు వద్దే నిలిచిపోయాయి. ఓవైపు ఈక్విటీల కొనుగోళ్లు, మరోవైపు అమ్మకాలు నమోదవుతుండటంతో, ఏ కంపెనీ ఈక్విటీ కూడా భారీ హెచ్చు తగ్గులకు లోనుకాలేదు. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 0.11 పాయింట్లు తగ్గి 0.001 శాతం నష్టంతో 26,843.03 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 1.85 పాయింట్లు పెరిగి 0.02 శాతం లాభంతో 8,220.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.11 శాతం, స్మాల్ కాప్ 0.42 శాతం నష్టపోయాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 21 కంపెనీలు లాభపడ్డాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా పవర్, హిందుస్థాన్ యూనీలివర్, ఎన్టీపీసీ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఐడియా, భారతీ ఎయిర్ టెల్, లుపిన్, బీహెచ్ఈఎల్, హీరో మోటోకార్ప్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,800 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,091 కంపెనీలు లాభాలను, 1,532 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గురువారం నాడు రూ. 99,96,406 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 99,88,268 కోట్లకు తగ్గింది.

More Telugu News