: అమ్మా! మీరు కల్పించుకోవాల్సిందే... లేకుంటే మాకు ఆత్మహత్యే శరణ్యం!: జయలలితకు శివశింకర్ మాస్టర్ లేఖ

వివిధ సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేసి విశేషమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పటికీ, 'ఆట' టీవీ ప్రోగ్రాంకు న్యాయనిర్ణేతగా పనిచేసి మరింత పేరు సొంతం చేసుకున్న డాన్స్ మాస్టర్ శివశంకర్ తన కుటుంబ సమస్యను వివరిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రాశారు. తమ కుటుంబ సమస్యను పరిష్కరించకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని ఆయన లేఖలో తెలిపారు. 2013లో తన కుమారుడు విజయశంకర ప్రసాద్ కు బెంగళూరుకు చెందిన జ్యోతితో వివాహం జరిపించామని అన్నారు. అనంతరం ఏర్పడ్డ విభేదాలతో జ్యోతి తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆయన తెలిపారు. విడాకులు తీసుకున్న తరువాత కూడా తమ కుటుంబంపై కేసులు పెట్టి వేదనకు గురిచేస్తోందని ఆయన లేఖలో ఆరోపించారు. ఆమె వేధింపులు భరించలేక, కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయామని తెలిపారు. పది కోట్లు డిమాండ్ చేస్తూ, తమ ఇంటిని లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని లేఖలో ఆయన జయలలితను కోరారు. లేని పక్షంలో ఆత్మహత్యే తమ కుటుంబానికి శరణ్యమని ఆయన తెలిపారు.

More Telugu News