: భారీ బాదుడు!... అర్ధరాత్రి నుంచే అమల్లోకి పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు!

ఇంధన ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. పెట్రోల్ పై లీటరుకు రూ.2.58, డీజిల్ పై రూ.2.26 పెంచుతూ చమురు కంపెనీలు నిన్న కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ఇంధన ధరలపై నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేశాక... అంతర్జాతీయ చమురు మార్కెట్ స్థితిగతులు, డాలర్ తో రూపాయి మారకం విలువల ఆధారంగా ప్రతి రెండు వారాలకు ఓ మారు ఇంధన ధరలపై ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 15 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా నిన్న ఆయిల్ కంపెనీలు భారీ బాదుడుకు శ్రీకారం చుట్టాయి. పెట్రోల్, డీజిల్...రెండింటి ధరలను రెండున్నర రూపాయల మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆయిల్ కంపెనీలు పెంచిన ధరలు స్థానిక పన్నులతో కలుపుకుని ప్రస్తుతం హైదరాబాదులో లీటర్ పెట్రోల్ రూ.2.72 పెరిగి రూ.69.89 కి చేరింది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.2.48 పెరిగి రూ. 58.74కు చేరింది.

More Telugu News