: అధ్యక్ష ఎన్నికలపై కలత వద్దు, అంతా సవ్యంగానే సాగుతుంది: ఆసియన్లకు ఒబామా భరోసా

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆసియన్ దేశాల్లో కలత పెరుగుతుండటంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా రంగంలోకి దిగారు. అధ్యక్ష ఎన్నికలపై కలత వద్దని, అంతా సవ్యంగానే సాగుతుందని ఆయన అన్నారు. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడనున్న డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వైఖరి, ఆయన ముస్లింలకు, వీసా విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలపై పలు దేశాలు మండిపడుతుండగా, ఎన్నో దేశాల యువత ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. "ఇతర దేశాల ప్రజలు మా దేశంలోని ఎన్నికల విధానాన్ని నిత్యమూ పరిశీలిస్తున్నారని తెలుసు. కొందరిలో ఆందోళన కూడా ఉంది. అయితే, ఎన్నికలు ముగిసిన తరువాత అంతా మామూలుగానే ఉంటుంది. అమెరికన్లు ఎంతో మంచి వారు. కొన్నిసార్లు మా రాజకీయాలు ప్రజల మంచిని గురించి చెప్పవు. ఎవరూ బాధపడాల్సిన పరిస్థితులు తలెత్తవు" అని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికన్ ఓటర్లు తెలివైన నిర్ణయాలే తీసుకుంటారని, వారి అంచనాలు ఎప్పుడూ తప్పుకావని అన్నారు.

More Telugu News