: పన్ను ఎగవేతదారులకు ఇక చుక్కలే!... ‘నేమ్ అండ్ షేమ్’ అస్త్రాన్ని బయటకు తీసిన ఐటీ శాఖ

గుట్టుచప్పుడు కాకుండా ఆదాయాన్ని దాచేస్తూ ప్రభుత్వానికి పన్నును ఎగవేస్తున్న అక్రమార్కులకు ఇక పట్టపగలే చుక్కలు కనిపించక మానవు. పన్నుఎగవేతలకు చెక్ పెట్టేందుకు ఆదాయపన్ను శాఖ కొత్తగా ‘నేమ్ అండ్ షేమ్’ అస్త్రాన్ని బయటకు తీసింది. సరికొత్తగా రూపొందించిన ఈ పథకం కింద రూ.1 కోటి అంతకంటే ఎక్కువ పన్నును ఎగవేసే వ్యక్తుల పేర్లను ఆదాయపన్ను శాఖ ప్రముఖ దినపత్రికల్లో ప్రచురించనుంది. సదరు వ్యక్తుల పేర్లు, చిరునామాలు, పాన్, ఫోన్ నెంబర్లు సహా మొత్తం వివరాలను పత్రికల్లో ప్రకటించడం ద్వారా వారికి సమాజంలో విలువ లేకుండా చేయడమే లక్ష్యంగా ఆదాయపన్ను శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ దిశగా పనిని ప్రారంభించిన ఆదాయపన్ను శాఖ... గతేడాది నుంచి ఇప్పటిదాకా 67 మంది పేర్లను బయటపెట్టింది. తొలుత రూ.20 నుంచి 30 కోట్ల పన్నును ఎగవేసిన వారి పేర్లనే బయటపెట్టాలని భావించిన ఆ శాఖ తాజాగా రూ.1 కోటి పన్నును ఎగవేసిన వారి పేర్లను కూడా బహిర్గతం చేయాలని నిర్ణయించింది. తాము పన్ను ఎగవేస్తున్నట్లు సమాజానికి తెలిసిపోయిందన్న భావనతోనైనా వారు ప్రభుత్వానికి బకాయిలు చెల్లిస్తారని ఆ శాఖ అంచనా వేస్తోంది. మరి ఈ శాఖ కొత్త ప్రణాళిక ఏ మేరకు ఫలితాలిస్తుందో చూడాలి.

More Telugu News