: విమానయాన రంగంలోకి రానున్న వీఆర్ఎల్... వార్త బయటకు రాగానే పాతాళంలోకి కూరుకుపోయిన ఈక్విటీ!

ఇండియాలో ఓ ఎయిర్ లైన్స్ సంస్థను ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నట్టు వీఆర్ఎల్ లాజిస్టిక్స్ ప్రమోటర్ల నుంచి ఈ ఉదయం వచ్చిన ప్రకటన, ఆ సంస్థ ఈక్విటీ వాటాపై పెను ప్రభావాన్ని చూపింది. తమ నిర్ణయాన్ని సంస్థ చైర్మన్ విజయ్ శంకేశ్వర్, ఎండీ ఆనంద్ శంకేశ్వర్‌ లు బోర్డు డెరైక్టర్లకు రాసిన లేఖలో తెలియజేశారు. విషయం బయటకు రాగానే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినగా, మంగళవారం నాటి సెషన్లో వీఆర్ఎల్ లాజిస్టిక్స్ వాటా ధర పాతాళానికి కూరుకుపోయింది. ఈక్విటీ విలువ 20 శాతం పడిపోయి లోయర్ సర్క్యూట్ ను తాకగా, నిబంధనల మేరకు ట్రేడింగ్ ను నిలిపివేశారు. రూ. 1400 కోట్ల చిన్న మొత్తంతో తాము ఈ రంగంలోకి రానున్నామని, నిపుణుల సలహాలకు భిన్నంగా అడుగులు వేయబోమని వారు తెలిపారు. వీఆర్‌ఎల్‌ లో తమకున్న వాటాను తగ్గించుకోనున్నట్టు తెలిపారు. కాగా, గత సంవత్సరంలో ఐపీఓకు వచ్చి విజయవంతమైన సంస్థ, ఆపై గత నాలుగు త్రైమాసికాల్లో ఆర్థిక ఫలితాల్లో అంతంతమాత్రపు వృద్ధినే నమోదు చేసింది. క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్న వేళ, ఎయిర్ లైన్స్ సంస్థలు లాభాలను పొందుతున్నాయని, తిరిగి ముడిచమురు ధర పెరిగితే, నష్టాలు వస్తాయని అంచనా వేస్తున్న ఇన్వెస్టర్లు, వీఆర్ఎల్ తాజా నిర్ణయం పట్ల అంత సంతృప్తిగా లేరని సమాచారం.

More Telugu News