: చివర్లో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్ కు నష్టాలు!

సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే, 150 పాయింట్లకు పైగా లాభంలో కదిలిన సెన్సెక్స్, ఆపై ఒడిదుడుకుల మధ్య లాభాలను కొనసాగిస్తూ రాగా, ఆఖరి గంట వ్యవధిలో వెల్లువెత్తిన అమ్మకాలతో 200 పాయింట్లకు పైగా దిగజారింది. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో 25,450 పాయింట్ల వద్ద ఉన్న సూచిక, 3:30 గంటలకు 25,210 పాయింట్లకు చేరింది. అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లూ నష్టాల్లో ముగిశాయి. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 71.54 పాయింట్లు పడిపోయి 0.28 శాతం నష్టంతో 25,230.36 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 18.65 పాయింట్లు పడిపోయి 0.24 శాతం నష్టంతో 7,731.05 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.29 శాతం, స్మాల్ కాప్ 0.38 శాతం నష్టపోయాయి. ఇక, ఎన్ఎస్ఈ-50లో 15 కంపెనీలు లాభపడ్డాయి. ఐటీసీ, పవర్ గ్రిడ్, ఇన్ ఫ్రాటెల్, ఏసీసీ, టాటా పవర్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, లుపిన్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, సిప్లా, బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,759 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,075 కంపెనీలు లాభాలను, 1,513 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 95,59,497 కోట్లకు చేరుకుంది.

More Telugu News