: అట్టడుగు నుంచి నాకౌట్ కు...అంతా కోహ్లీ ప్రతిభే?

ఐపీఎల్ ప్రారంభం నాటికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టోర్నీ హాట్ ఫేవరేట్! కానీ ఓ ఐదు మ్యాచ్ లు ముగిసేసరికి రాయల్ ఛాలెంజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్ధానానికి దిగజారింది. కోహ్లీ, గేల్, డివిలియర్స్, వాట్సన్ వంటి భీకరమైన ఆటగాళ్లు కలిగిన జట్టు బౌలర్ల వైఫల్యంతో ప్రత్యర్ధుల ముందు తలవంచకతప్పలేదు. దీంతో బెంగళూరు జట్టు కాగితం మీదే పులులు, మైదానంలో అంత గొప్పజట్టు కాదు అంటూ విమర్శలు ప్రారంభమయ్యాయి. దీంతో జట్టు పునరాలోచనలో పడింది. బౌలర్లను అప్పటికప్పుడు మార్చడం కుదరదు. జట్టులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకున్న కోచ్, కెప్టెన్ కోహ్లీలు బౌలర్లను సానపట్టడం సాధ్యమయ్యేపని కాదని గ్రహించారు. దీంతో జట్టు వ్యూహాలను మార్చారు. భారం బౌలర్లపై వేయడం వల్లే ఓటములు ఎదురవుతున్నాయని, ఇకపై అలాంటిది జరగకూడదని తీర్మానించుకున్నారు. పిచ్ పై 150 పరుగులు చేయగలగడం సాధ్యమైన చోట 170 పరుగులు చేయడం ద్వారా విజయం సాధించవచ్చని నిర్ణయించారు. దీంతో జట్టులో కీలక ఆటగాళ్లు గేల్, కోహ్లీ, డివిలియర్స్, వాట్సన్ వేగంగా, నిలకడగా పరుగులు రాబట్టే బాధ్యతను భుజాన వేసుకున్నారు. దీంతో విజయానికి అవసరమైన పరుగుల కంటే పది లేదా ఇరవై పరుగులు ఎక్కువ చేయడం ప్రారంభించారు. టాస్ గెలిస్తే మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. దీంతో పరిస్థితులకు తగ్గట్టు ఆడవచ్చని భావించారు. ఈ వ్యూహం సత్ఫలితాన్ని ఇచ్చింది. దీనికి టాస్ కూడా కలిసి రావడంతో టోర్నీలో నాకౌట్ కు చేరే అవకాశం లేదని భావించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 2 జట్టుగా నాకౌట్ లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన టాప్ ముగ్గురు బ్యాట్స్ మన్ లో కోహ్లీ, డివిలియర్స్ స్థానం సంపాదించుకున్నారు. మరో అడుగు వేస్తే టైటిల్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలవడం సాధ్యమే. దీంతో పోరాడితే పోయేదేం లేదు... అన్న శ్రీశ్రీ మాటలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సాధ్యం చేసి చూపించింది.

More Telugu News