: ఇండియాను తిడతావా... నోర్ముయ్!: ట్రంప్ పై మండిపడ్డ హిల్లరీ క్లింటన్ టీం

ఓ ప్రచార ర్యాలీలో మాట్లాడుతున్న డొనాల్డ్ ట్రంప్, ఇండియన్ కాల్ సెంటర్ వర్కర్లను అవహేళన చేసేలా మాట్లాడినందుకు, డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి బరిలో దిగుతారని భావిస్తున్న హిల్లరీ క్లింటన్ ప్రచార టీం నిప్పులు చెరిగింది. ఇండియా వంటి దేశాలపై అర్థరహిత విమర్శలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని, మతాలు, జాతులను కించపరిచే మాటలు నిలిపివేయాలని క్లింటన్ ప్రచార బాధ్యతల విభాగం చైర్మన్ జాన్ పోడెస్టా హితవు పలికారు. విదేశీయులపై తప్పుడు ఆరోపణలు చేయడం కన్నా కళ్లు, నోరు మూసుకుని ఉండాలని సూచించారు. ట్రంప్ వ్యాఖ్యలు దేశానికే ప్రమాదమని, ఆయన ప్రచారం ప్రపంచవ్యాప్తంగా అమెరికా పట్ల, అమెరికన్ల పట్ల ద్వేష భావానికి బీజాలు నాటుతున్నాయని విమర్శించారు. కాగా, ఇటీవల డెలావర్ లో జరిగిన తన ప్రచార సభలో "కాల్ సెంటర్ లోని ఇండియన్ ఉద్యోగి ఇలా మాట్లాడుతాడు" అంటూ, తనలోని నటుడుని ట్రంప్ బయటకు తీశారు. వారు మాట్లాడేది తప్పుడు ఇంగ్లీష్ అంటూ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భారత్ గొప్పదని, అక్కడి నేతల పట్ల తనకు కోపం లేదని ఆయన చెప్పినప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

More Telugu News