: కలిస్, కటిచ్ నాకు అవకాశం కల్పించారు: యూసఫ్ పఠాన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించడంపై కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు యూసఫ్ పఠాన్ ఆనందం వ్యక్తం చేశాడు. యూసఫ్ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ ఆ జట్టును విజయ పథాన నిలిపిన సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న యూసఫ్ మాట్లాడుతూ, ఐపీఎల్ లో చివరి మూడు ఓవర్లలో బ్యాటింగ్ అవకాశం వస్తుండడంతో భారీ షాట్లు ఆడడం తప్ప వేరే మార్గం లేకుండా పోయిందని అన్నాడు. క్రీజులో కుదురుకుని ఆడేందుకు అవకాశం ఉండదని తెలిపిన యూసఫ్ పఠాన్, బెంగళూరుతో మ్యాచ్ లో పదో ఓవర్ తరువాత బ్యాటింగ్ కు దిగే అవకాశం హెడ్ కోచ్ జాక్వెస్ కలిస్, హెల్పింగ్ కోచ్ సైమన్ కటిచ్ లు కల్పించారని చెప్పాడు. అందువల్ల తాను నిలదొక్కుకుని భారీ షాట్లు ఆడే అవకాశం కలిగిందని యూసఫ్ తెలిపాడు. వారిద్దరికీ ధన్యవాదాలు తెలిపాడు. కెప్టెన్ గంభీర్ ఆటగాళ్లకు అన్ని విధాలుగా అండగా ఉంటాడని యూసఫ్ పఠాన్ వెల్లడించాడు. కాగా, నిన్నటి మ్యాచ్ లో కేవలం 29 బంతుల్లో 60 పరుగులు చేసి సత్తాచాటిన సంగతి తెలిసిందే. గత సీజన్ లో విఫలమవడం ద్వారా జట్టులో స్థానంపై అనుమానాలు రేకెత్తించిన యూసఫ్ పఠాన్ గెలవడం అసాధ్యమనుకున్న మ్యాచ్ ను గెలిపించడం ద్వారా ఫాంలోకి రావడం పట్ల ఆ జట్టులో ఆనందం వ్యక్తమవుతోంది.

More Telugu News