: ‘ట్రంప్’ ప్లాజాలో మాల్యాకు మూడు ఫ్లాట్లు!... ఆస్తుల చిట్టాలో చూపని వైనం

బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన ప్రముఖ మద్యం తయారీ వ్యాపారి విజయ్ మాల్యాకు సంబంధించి మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. అమెరికా వాణిజ్య రాజధానిగా పేరున్న న్యూయార్క్ లోని ఓ విలాసవంతమైన అపార్ట్ మెంట్ లో రెండు లగ్జరీ ఫ్లాట్లతో పాటు ఓ పెంట్ హౌస్ ను కూడా మాల్యా కొనుగోలు చేశారు. 2010లోనే వీటిని కొనుగోలు చేసిన మాల్యా... రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా వీటిని ఆయన తన ఆస్తుల చిట్టాలో మాత్రం పేర్కొనలేదు. ఇక మాల్యా ఫ్లాట్లు కొన్న అపార్ట్ మెంట్ ఎవరిదో తెలుసా?... అమెరికా అధ్యక్ష బరిలో డెమొక్రటిక్ అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి డొనాల్డ్ ట్రంప్ కు చెందినదట. ‘ట్రంప్ ప్లాజా’గా నామకరణం చేసిన ఈ అపార్ట్ మెంట్ లో కూతురు తాన్యా మాల్యా పేరిట విజయ్ మాల్యా రెండు ఫ్లాట్లను రూ.6.3, రూ.7.9 కోట్ల చొప్పున కొనుగోలు చేశారు. ఇక రూ.15.9 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన పెంట్ హౌస్ ను మాత్రం మాల్యా తన పేరిటే రిజిస్టర్ చేయించుకున్నారు. 2010 మార్చిలో తొలి ఫ్లాట్, పెంట్ హౌస్ ను కొనుక్కున్న మాల్యా... అదే ఏడాది సెప్టెంబర్ లో రెండో ఫ్లాట్ ను కొన్నారు. నాడు మైనర్ గా ఉన్న తన కూతురు పేరిట కొన్న సదరు ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ పత్రాల్లో మాల్యా పేరు కూడా ఉంది. తన కూతురు పేరిట కొన్న ఆ ఫ్లాట్లకు సంబంధించిన పత్రాల్లో... యజమానిగానే కాక తన కూతురుకు సంరక్షకుడిగా కూడా ఆయన తనను పేర్కొన్నారు.

More Telugu News