: రాణించిన అమిత్ మిశ్రా...111 పరుగులకే పరిమితమైన పంజాబ్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కేవలం 111 పరుగులకే పరిమితమైంది. మొహాలీ వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు స్టార్ ఆటగాళ్లు విఫలం కావడంతో ఆకట్టుకోలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు ఆదిలోనే మురళీ విజయ్ (1) వికెట్ కోల్పోయింది. అనంతరం షాన్ మార్స్ (13) కూడా పెవిలియన్ బాటపట్టాడు. రెండు షాట్లతో కుదురుకునేలా కనిపించిన పంజాబ్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (9) కూడా తొందరగానే అవుటయ్యాడు. అనంతరం వచ్చిన మ్యాక్స్ వెల్ పేలవమైన షాట్ ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో ఓపెనర్ గా వచ్చి రాణించిన వోహ్రా (32)ను మిశ్రా బోల్తా కొట్టించాడు. వెంటనే సాహా (3) రనౌట్ గా పెవిలియన్ చేరాడు. రెండు షాట్లతో అలరించిన అక్షర్ పటేల్ (11) ను యాదవ్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే మిచెల్ జాన్సన్ (4) ను మోరిస్ అవుట్ చేశాడు. అనంతరం భారీ షాట్లతో అలరించిన మోహిత్ శర్మ (15) ను జహీర్ అవుట్ చేశాడు. చివర్లో సాహూ (18) మెరుపులు మెరిపించడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అమిత్ మిశ్రా నాలుగు వికెట్లతో రాణించి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకోగా, జహీర్ ఖాన్, యాదవ్, మోరిస్, చెరో వికెట్ తీసి ఆకట్టుకున్నారు. 112 పరుగులతో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.

More Telugu News