: ధోనీ హోం గ్రౌండ్ గా విశాఖ ఎంపిక?...విశాఖకు అలా కలిసొస్తోంది

టీమిడియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ హోం గ్రౌండ్ గా విశాఖపట్టణం ఎంపిక కానుంది. ధోనీకి విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎంతో అచ్చొచ్చింది. ఐపీఎల్ లో భాగంగా మహారాష్ట్రలో నిర్వహించాల్సిన మ్యాచ్ లను ఇతర ప్రాంతాలకు తరలించాలని బాంబే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్, రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్లు ఇతర రాష్ట్రాల్లోని హోం గ్రౌండ్స్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ ధోనీ తనను స్టార్ ను చేసిన విశాఖ స్టేడియంకే ఓటేశాడు. దీంతో ఈ ఏడాదికి రెయిజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు హోం గ్రౌండ్ గా విశాఖపట్టణాన్ని ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇకపై పూణే ఆడనున్న మ్యాచ్ లు విశాఖలో జరగనున్నాయి. కాగా, ముంబై ఇండియన్స్ జట్టు మొహాలీ వైపు ఆసక్తిగా చూస్తున్నప్పటికీ ఆ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ హోం గ్రౌండ్ గా కొనసాగుతోంది. దీంతో ముంబై హోం గ్రౌండ్ పై స్పష్టత రావాల్సి ఉంది. గత ఏడాది ఉప్పల్ స్టేడియం గ్రేటర్ హైదరాబాదుకు పన్నులు కట్టకపోవడంతో భద్రత కల్పించలేదు. నీటి, విద్యుత్ సరఫరా నిలిపేసింది. దీంతో మ్యాచ్ లు విశాఖకు తరలాయి. ఈ ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడంతో మ్యాచ్ లు విశాఖకు తరలాయి. ఇతర జట్ల కష్టాలు విశాఖకు కలిసి వస్తున్నాయి.

More Telugu News