: ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి... ప్రధాని సీరియస్ గా ఉన్నారు: నల్లధనం దాచుకున్న వారిపై జైట్లీ మండిపాటు

విదేశాల్లో నల్లధనాన్ని దాచుకున్న వారు ఇకనైనా సిగ్గుపడి ఆ వివరాలు బయటకు వెల్లడించి, దేశాభివృద్ధికి సహకరించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. విదేశాల్లో అక్రమ ఆస్తులు కూడబెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 'పనామా పేపర్స్' వ్యవహారంపై స్పందించిన జైట్లీ, కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాస్తుల స్వచ్ఛంద వెల్లడికి గత సంవత్సరం బడ్జెట్ సందర్భంగా అవకాశం కల్పించామని ఆయన గుర్తు చేశారు. తాజాగా విడుదలైన జాబితా వివరాలు ఇండియాతో పాటు ప్రపంచానికి కనువిప్పు కావాలని జైట్లీ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని, ఇందులో వచ్చిన భారతీయుల పేర్ల వివరాలను ప్రధాని సీరియస్ గా తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్), ఆర్బీఐ సహా బహుళ సంస్థల బృందం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు. వీరందరి గుట్టునూ త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు.

More Telugu News