: ఆ ముగ్గురూ టీమిండియా సెమీఫైనల్ జట్టులో చోటు సంపాదించినట్టేనా?

కాసేపట్లో వెస్టిండీస్ తో మ్యాచ్ ప్రారంభం కానుండగా, టీమిండియా జట్టు కూర్పుపై పలు వార్తలు వెలువడుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ ఆరంభం నుంచి విఫలమవుతున్న టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో రిజర్వ్ బెంచ్ లో కూర్చున్న అజింక్యా రహానేను తీసుకోవాలని ధోనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గాయపడ్డ యువరాజ్ సింగ్ స్థానంలో మనీష్ పాండే ఖరారైనట్టే భావించవచ్చు. ఇక విండీస్ విధ్వంకర ఆటగాడు గేల్ కు ఐపీఎల్ లో ముకుతాడు వేసిన హర్భజన్ సింగ్ ను కూడా జట్టులోకి తీసుకోవచ్చనే ఊహాగానాలు వినబడుతున్నాయి. భజ్జీని జట్టులోకి తీసుకుంటే ఎవరిని తొలగించనున్నారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ మధ్య కాలంలో అశ్విన్, జడేజా అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నారు. వారిని విడదీసే అవకాశం లేదు. యువీ దూరమైన ప్రస్తుత తరుణంలో రైనాను తప్పిస్తే...మిడిల్ ఆర్డర్ బలహీనపడే అవకాశం ఉంది. ఇప్పటివరకు టీమిండియా 8వ డౌన్ వరకు బ్యాట్స్ మన్ తో బలంగా ఉండేది. భజ్జీని జట్టులోకి తీసుకుంటే ఇది 6కి పడిపోయే ప్రమాదం ఉంది. ఇంతవరకు ఈ టోర్నీలో ఆడని రహానే, మనీష్ పాండే, భజ్జీల నుంచి అద్భుతమైన ప్రదర్శన ఆశించడం అత్యాశే అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో టీమిండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ పై బ్యాటింగ్ భారం పడనుంది. దీంతో విండీస్ లాంటి బలమైన జట్టుపై టీమిండియా విజయం సాధిస్తుందా? అనే అనుమానం సగటు అభిమానిలో నెలకొంది.

More Telugu News