: విరాట్ కోహ్లీ వల్ల ఇవన్నీ కనుమరుగైపోయాయి: కపిల్ దేవ్

విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ వల్ల ఎన్నో అద్భుతాలు కనుమరుగైపోయాయని టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఇన్నింగ్స్ పై కపిల్ మాట్లాడుతూ, ఆస్ట్రేలియా జట్టు అద్భుతంగా ఆడిందని అన్నారు. తొలి ఐదు ఓవర్లలో 50 పరుగులు రాబట్టుకుందంటే ఆసీస్ బ్యాటింగ్ ఏ రీతిలో జరిగిందో ఊహించవచ్చని పేర్కొన్నారు. టీమిండియా బౌలర్లను ఆసీస్ ఆటగాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. అయితే ఆశిష్ నెహ్రా తన అనుభవాన్నంతా రంగరించి ఖ్వాజాను అవుట్ చేయడంతో టీమిండియా ఆసీస్ ను నిలువరించగలిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అశ్విన్ వేసిన ఆఫ్ సైడ్ బంతులను చక్కగా ఆడడం ఆసీస్ ఆటగాళ్లు ఎంతగా కష్టపడ్డారో చెబుతుందని ఆయన పేర్కొన్నారు. ఫించ్ ను అవుట్ చేసేందుకు టీమిండియా బౌలర్లు చాలా శ్రమించారని ఆయన అన్నారు. కీలక సమయంలో బంతిని యువరాజ్ కు ఇవ్వడం ధోనీ ఎత్తుగడ లక్షణాన్ని చెబుతుందని ఆయన పేర్కొన్నారు. ఎంతో అనుభవం కలిగిన యువరాజ్ ఒక్కో బంతిని ఒక్కోరకంగా సంధించగల నైపుణ్యమున్నవాడని, అతనికి బంతినివ్వడంతో ఆసీస్ బ్యాట్స్ మన్ వ్యూహం మార్చుకోవాల్సి వచ్చిందని, యువీ కూడా బంతి అందుకున్న వెంటనే స్మిత్ ను పెవిలియన్ బాటపట్టించడం జట్టుకు లాభించిందని కపిల్ చెప్పాడు. టీమిండియా తడబడుతూ బ్యాటింగ్ ప్రారంభించిందని ఆయన అన్నారు. కోహ్లీ కూడా తొలుత తడబడ్డాడని, తరువాత కుదురుకుని బ్యాటు ఝుళిపించాడని ఆయన చెప్పారు. అయితే కోహ్లీ ఇన్నింగ్స్ ముందు లోపాలేవీ కనబడలేదని, కేవలం కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ మాత్రమే అందరి మెదళ్లలో నాటుకుపోయిందని ఆయన తెలిపారు. అందుతున్న ప్రశంసలన్నింటికీ కోహ్లీ వందశాతం అర్హుడని ఆయన పేర్కొన్నారు.

More Telugu News