: ప్ర‌త్య‌ర్థిపై పిడిగుద్దులు కురిపిస్తా, త‌ప్ప‌క‌రండి.. మోదీకి విజేంద‌ర్ సింగ్ ఆహ్వానం

బాక్సింగ్‌లో ఎన్నో విజ‌యాల‌ను సొంతం చేసుకున్న స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీని క‌లిశాడు. బాక్సింగ్‌ వ్యవహారాలకు సంబంధించి చర్చించాడు. గత సంవత్సరం ప్రొఫెషనల్‌గా మారిన విజేందర్‌.. తలపడిన నాలుగు పోటీల్లోనూ నాకౌట్‌ విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం 10రోజుల హోలీ బ్రేక్ లో ఉన్న ఆయ‌న‌ .. ఏప్రిల్ 30న లండన్‌లో జ‌ర‌గ‌నున్న బాక్సింగ్‌ పోరులో త‌న ఫైటింగ్ చూడ‌డానికి రావాల‌ని మోదీని ఆహ్వానించాడు. భారతీయ బాక్సింగ్‌ కార్యకలాపాలు ఎలా వున్నాయి? ఏం జరుగుతోంది? అన్న విషయాలను తెల‌పాల‌ని మోదీ తనను అడిగిన‌ట్లు ఆయ‌న చెప్పాడు. గ‌తంలో అమెచ్యూర్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన ఈ హర్యానా బాక్సర్... లండన్‌లోని క్వీన్స్‌బెర్రీ ప్రమోషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. తీవ్రంగా శ్రమించి ప్రపంచస్థాయిలో భారత్‌కు మరింత పేరు తేవాలని అనుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2009 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2010 గ్వాంగ్‌జూ ఆసియా క్రీడల్లో స్వర్ణం, కామన్వెల్త్ గేమ్స్‌లలో రజతం, రెండు కాంస్యాలు నెగ్గిన విజేందర్ భారత బాక్సింగ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.

More Telugu News