: వరుస సెలవులకు ముందు వేచి చూసే ధోరణిలో ఇన్వెస్టర్లు!

సుదీర్ఘ వారాంతపు సెలవులకు ముందు ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిలో ఉండటంతో స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగిన సూచికలు దాదాపు స్థిరంగా నిలిచాయి. సెషన్ ఆరంభంలోని నష్టాలు, ఆపై కొనుగోలు మద్దతుతో తగ్గుతూ వచ్చాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచిక 7,700 పాయింట్ల వద్ద కొనుగోలు మద్దతును పరీక్షించుకుంది. బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 7.07 పాయింట్లు పెరిగి 0.03 శాతం లాభంతో 25,337.56 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 1.60 పాయింట్లు పెరిగి 0.02 శాతం లాభంతో 7,716.50 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.24 శాతం, స్మాల్ క్యాప్ 0.23 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 19 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. హిందాల్కో, ఐడియా, టాటా స్టీల్, బజాజ్ ఆటో, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభపడగా, రిలయన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, లుపిన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గెయిల్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,772 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,287 కంపెనీలు లాభాల్లోను, 1,313 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 94,29,342 కోట్లకు పెరిగింది.

More Telugu News