: చేతికి అంటించుకుంటే చాలు, ర‌క్తంలో చక్కెర స్థాయి తెలిసిపోతుంది

ఇక మీదట రక్తంలో చక్కెర స్థాయి సరిచూసుకునేందుకు శరీరాన్ని సూదులతో ఇబ్బంది పెట్టనక్కర్లేదు.. ఒక ప్యాచ్‌ను చేతికి అంటించుకుంటే చాలు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో బేసిక్‌ సైన్స్‌ ఇన్స్‌టిట్యూట్‌కి చెందిన హ్యుంజే లీ నేతృత్వంలో పరిశోధకులు రక్తంలో చక్కెర స్థాయిని తెలిపే ఓ ప్యాచ్‌ను అభివృద్ధి చేశారు. ఈ ప్యాచ్‌ రక్తంలో చక్కెర స్థాయిని చెప్పేయ‌డ‌మే కాదు.. శరీరంలోకి మందును పంపి.. రక్తంలో చక్కెరను సైతం నియంత్రిస్తుంది. స్వేదాన్ని ఆధారం చేసుకుని చక్కెరస్థాయిని గణించే ఈ ప్యాచ్‌ను బంగారం, గ్రాఫీన్‌ సమ్మేళనాలు, కొన్ని సూక్ష్మ సెన్సర్ల సాయంతో త‌యారు చేశారు. ప‌రిశోధ‌కులు ఇప్ప‌టికే ఈ ప్యాచ్‌ను ఇద్దరిపై పరిశోధించగా గ్లూకోజ్‌ స్థాయులను కచ్చితంగా గుర్తించింది. ప్యాచ్‌ను మరింత మెరుగుప‌ర్చే ప‌నిలో ఉన్నారు. డయాబెటిస్ అనేది ఈవేళ సాధారణ వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి వచ్చిందంటే ఇక జీవితాంతం మందులు వాడుతూ, ఆహారనియమాలు పాటించాల్సిందే. అంతేకాక ఎన్నో ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా ఇది కారణం కావచ్చు. ప‌రిశోధ‌కులు అభివృద్ధి చేస్తోన్న ఈ ప్యాచ్‌తో తేలికగా ఎప్ప‌టిక‌ప్పుడు చ‌క్కెర స్థాయి చూసుకోవ‌చ్చు, ర‌క్తంలో చ‌క్కెర‌ను నియంత్రించుకోవ‌చ్చు.

More Telugu News