: 'ప‌తంజ‌లి'ని తట్టుకోవడానికి 'బైథ్య‌నాథ్‌' ప్లాన్లు!

గ్లోబ‌ల్ మేనేజ్‌మెంట్ క‌న్స‌ల్టెన్సీ సంస్థ అయిన‌ మెకిన్సే అండ్ కంపెనీకి మూడు నెల‌ల క్రితం గుడ్‌బై చెప్పి ప్రముఖ భారత ఆయుర్వేద‌ సంస్థ బైథ్య‌నాథ్‌లో చేరిన‌ పారిశ్రామికవేత్త అమేవీ శ‌ర్మ ఇప్పుడు మార్కెట్లో కొత్త ఉత్ప‌త్తుల‌ను విడుద‌ల చేసే ప‌నిలో బిజిగా ఉన్నారు. అయితే, బైద్యనాథ్ కు రామ్‌దేవ్ ప‌తంజ‌లి ఆయుర్వేద సంస్థ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ పోటీకి దీటుగా త‌మ ఉత్ప‌త్తులకు మార్కెట్ క‌ల్పించ‌డంలో అమేవీ శ‌ర్మ నిమ‌గ్న‌మ‌య్యారు. అయితే, త‌మ బ‌ల‌మైన బ్రాండ్ ఈక్విటీ అమ్మ‌కాల‌ను నిర్ణ‌యించ‌లేద‌ని అమేవీ శ‌ర్మ అన్నారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ.3 వేల కోట్ల వార్షిక ఆదాయ‌మే త‌మ లక్ష్యమ‌ని తెలిపారు. బైద్యనాథ్ స‌హా వీకో, సాందు, అమృతాంజ‌న్, చ‌ర‌క్ వంటి ఆయుర్వేద ఉత్ప‌త్తులు మార్కెట్లో రామ్‌దేవ్‌ పతంజ‌లి ఉత్ప‌త్తులు చూపినంత‌గా ప్ర‌భావం చూప‌డంలేదు. వీటిల్లో కొన్ని కంపెనీలు వంద ఏళ్ల‌కు ముందు ప్రారంభించిన‌వే. అయినా మార్కెట్‌ను ఆశించినంత‌గా క్యాష్ చేసుకోలేక‌పోయాయి. కానీ మార్కెట్లోకి పతంజ‌లి వ‌చ్చి ద‌శాబ్ద కాల‌మే అవుతున్నా డిటెర్జెంట్స్, టూత్‌పేస్ట్, నెయ్యి, అట్టా వంటి ఉత్ప‌త్తుల‌ను సైతం ప్ర‌వేశ‌పెట్టి ఎఫ్ఎమ్‌సీజీ మార్కెట్లో భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. దీంతో బైథ్య‌నాథ్ వంటి సంస్థ‌లు వెనుక‌ప‌డి పోయాయి. అయితే మార్కెట్లో ఉన్న ఇత‌ర‌ కంపెనీల పోటీకి దీటుగా త‌మ ఉత్ప‌త్తుల‌ను అభివృద్ధి చేసే ప‌నిలో ప‌డ్డారు. మ‌రో వందేళ్ల‌యినా స్థిర‌మైన అభివృద్ధితో త‌మ ఉత్ప‌త్తుల‌ను కొన‌సాగిస్తామ‌ని బైథ్య‌నాథ్ సంస్థ అధికారి ఒక‌రు చెప్పారు.

More Telugu News