: బుల్ సూపర్ హై జంప్... గంట వ్యవధిలో 600 పాయింట్ల నష్టం నుంచి 120 పాయింట్ల లాభానికి!

స్టాక్ మార్కెట్ వర్గాలకు జైట్లీ బడ్జెట్ ప్రతిపాదనలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఆయన ప్రసంగం సాగుతున్నంత సేపూ భారీ నష్టాల్లో నడిచిన సూచికలు, చివర్లో నల్లధనంపై చేసిన ఒక్క వ్యాఖ్యతో కొనుగోళ్లతో వెల్లువెత్తింది. బ్లాక్ మనీ బిల్లును తీసుకువస్తామని ఆయన చెప్పిన మాట ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెంచింది. గత సంవత్సరం ప్రవాస భారతీయులకు మేలు కలిగేలా స్వచ్ఛంద ఆదాయ వివరాల వెల్లడి, ఆపై 50 శాతం జరిమానాతో కేసులు లేకుండా సర్దుబాటు పథకం విజయవంతమైందని చెబుతూ, దేశవాళీ పన్ను చెల్లింపుదారులకు కూడా ఇదే విధమైన విధానం తెస్తామని జైట్లీ వ్యాఖ్యానించారు. 1997 తరువాత ఈ తరహా పథకాన్ని ఇండియాలో తెస్తామని చెప్పడం ఇదే తొలిసారి. ఆమ్నెస్టీ స్కీమ్ ను దేశంలో ప్రకటించడంపై ముందస్తు సంకేతాలు లేకపోవడంతో మార్కెట్ వర్గాలతో పాటు ఆర్థిక నిపుణులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇక మౌలిక రంగానికి పెద్ద పీట వేయడం, స్టార్టప్ సంస్థలకు మూడేళ్ల పన్ను రాయితీలు, ఉపాధి, నైపుణ్యాలను పెంచేలా నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచాయి. దీంతో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో క్రితం ముగింపుతో పోలిస్తే 600 పాయింట్ల నష్టంలో ఉన్న సెన్సెక్స్ సూచిక 1:30 గంటల సమయానికి 120 పాయింట్లు పెరిగి 23,227 పాయింట్లకు ఎగబాకింది. సెన్సెక్స్ లోని అన్ని సెక్టార్లూ నష్టాలను గణనీయంగా తగ్గించుకున్నాయి. నిఫ్టీ-50లో ఓ దశలో 3 కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉండగా, ఇప్పుడు 30కి పైగా కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి.

More Telugu News