: ఇకపై బిల్లు చెల్లించాలంటే సెల్ఫీ తీసుకోవాలి!

ఇకపై బిల్లు చెల్లించాలంటే సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికాకు చెందిన బ్యాంకింగ్ సేవల దిగ్గజం మాస్టర్ కార్డ్ సరికొత్త పద్ధతిని అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో బ్యాంకింగ్ కార్యకలాపాలు, వస్తు కొనుగోళ్లు, సేవల చెల్లింపులు అన్నీ మొబైల్ మాధ్యమంగా జరిగిపోతున్నాయి. దీంతో ఈ చెల్లింపుల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు నూతన సెక్యూరిటీ విధానం అందుబాటులోకి రానుంది. ఈ విధానం ద్వారా చెల్లింపులు, మనీ ట్రాన్స్ ఫర్ వంటి బ్యాంకింగ్ కార్యక్రమాలు చేపట్టినప్పుడు అది సెల్ఫీ అడుగుతుంది. అప్పుడు అది సూచించిన ప్రదేశంలో మనం కళ్లను బ్లింక్ చేయడం ద్వారా లావాదేవీలు జరిగిపోతాయి. ఇందుకోసం మాస్టర్ కార్డు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా సరైన యజమానిని సదరు స్మార్ట్ ఫోన్ లోని యాప్ గుర్తిస్తుందని, తద్వారా అక్రమాలకు చెక్ పడుతుందని వారు పేర్కొంటున్నారు. కాగా, యాపిల్ పే, హెచ్ఎస్బీసీ ఇప్పటికే క్రెడిట్ కార్డుల చెల్లింపులు థంబ్ ఇంప్రెషన్ ద్వారా జరుపుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News