: మాల్యాకు మరింత కష్టం... కింగ్ ఫిషర్ హౌస్ వేలం నోటీసు జారీ

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరిన్ని కష్టాల్లో కూరుకుపోయారు. బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో మాల్యా విఫలం కాగా, ఇప్పటికే యూబీ గ్రూప్ దివాలా తీసిందని పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తమకు రావాల్సిన రూ. 6,963 కోట్ల కోసం కింగ్ ఫిషర్ హౌస్ ను వేలం వేయనున్నట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ చట్టం 2002 ప్రకారం, తమ తాకట్టులో ఉన్న 2,401.70 చదరపు మీటర్ల భవనాన్ని వచ్చే నెల 17న వేలం వేయనున్నట్టు ఎస్బీఐ బహిరంగ ప్రకటన జారీ చేసింది. దీనిలో పాల్గొనే వారు రూ. 15 లక్షల డిపాజిట్ చెల్లించాలని వెల్లడించింది. కనీస రిజర్వ్ ధర రూ. 150 కోట్లని, ఆపై రూ. 5 లక్షల చొప్పున ఆఫర్ ధరను పెంచుకుంటూ పోవచ్చని తెలిపింది. ఈ-ఆక్షన్ విధానంలో వేలం ఉంటుందని స్పష్టం చేసింది. ముంబై ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉండే ఈ భవంతి నుంచే 2005 మేలో మాల్యా ఎయిర్ లైన్స్ సేవలను ప్రారంభించారు. అనతికాలంలోనే ఇండియాలో రెండవ అతిపెద్ద ఎయిర్ లైన్స్ గా కింగ్ ఫిషర్ దూసుకెళ్లినప్పటికీ, మాల్యాకు మాత్రం ఒక్క పైసా కూడా లాభం మిగల్లేదు.

More Telugu News