: ఓ కంపెనీని మూసేసుకుని మరీ ఇండియాలో అవకాశాల వైపు చూస్తున్న జర్మన్ సంస్థ!

ప్రముఖ జర్మనీ పెట్టుబడుల సంస్థ 'రాకెట్ ఇంటర్నెట్' తన ఆన్ లైన్ వ్యాపారాన్ని నిలిపివేయాలని, ఇదే సమయంలో శరవేగంగా ఎదుగుతున్న ఇండియాలోకి ప్రవేశించి ఏదైనా సంస్థతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని విస్తరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సంస్థ నిర్వహిస్తున్న ఆన్ లైన్ బిజినెస్ పోర్టల్ లు 'ఫ్యాబ్ ఫర్నిష్', 'ప్రింట్ వెన్యూ'లను ఆపాలని భావిస్తోంది. ఇండియాలో రాకెట్ ఇంటర్నెట్ నిర్వహిస్తున్న ప్రధాన సంస్థ జబాంగ్ సైతం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, దాన్ని కొనసాగిస్తూ, మరో భారత కంపెనీతో డీల్ కుదుర్చుకోవాలని చూస్తున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఫ్యాబ్ ఫర్నిష్ ను కొనసాగించేందుకు చేసిన తుది ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని ఆయన తెలిపారు. ఫర్నీచర్ ను ఆన్ లైన్లో విక్రయిస్తున్న ఫ్యాబ్ ఫర్నిష్ ను మార్చిలో మూసివేయనున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. ఇండియాలో ఫర్నీచర్ వ్యాపారాన్ని చేయలేమని, ఇదే సమయంలో మరో మార్గాన్ని వెతుకుతున్నామని ఆయన తెలిపారు. కాగా, గత సంవత్సరం ఆగస్టులో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 25 శాతం మందిని తొలగించిన సమయంలోనే దీని భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే.

More Telugu News