: ప్రియుడ్ని కత్తితో పొడిచి చంపానని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టి, కటకటాల వెనక్కి వెళ్లిన ప్రియురాలు

స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా జీవితంలో ఓ భాగంగా మారిపోయాయి. సంతోషం, దుఃఖం అన్నీ ఫేస్ బుక్ ద్వారా పంచుకుంటూ సాంత్వన పొందుతున్నారనడానికి ఉదాహరణగా నిలిచిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలోని హేమెట్ నగరంలో నకాసియా జేమ్స్ (18) అనే యువతి ప్రియుడు డొరియన్ పావెల్ (21) తో ఈ నెల 11న గొడవపడింది. ఇది తీవ్ర రూపం దాల్చడంతో కోపం పట్టలేకపోయిన నకాసియా కత్తి తీసుకుని డొరియన్ పావెల్ ను పొడిచింది. అతను మృతి చెందాడు. దీంతో ఆమె పరారీలో ఉంది. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమె పేస్ బుక్ ఖాతాలో "నా మాజీ ప్రియుడితో గొడవ జరిగింది. దీంతో అతను నా చెంపపై కొట్టాడు. కోపం పట్టలేక కత్తి తీసుకుని అతనిని పొడిచేశాను. నిజానికి అతనిని గాయపర్చాలని భావించలేదు. అయితే కోపం పట్టలేక ఏం చేస్తున్నానో తెలియక అలా చేసేశాను. అతను చనిపోయాడు. నేను పరారీలో ఉన్నాను. దేవుడు క్షమిస్తాడని భావిస్తున్నా" అంటూ పోస్టు చేసింది. ఆమెను ఎలా పట్టుకోవాలా? అని భావించిన పోలీసులు, ఈ పోస్టుతో ఆమె ఎక్కుడుందో కనుగొని, ఆమెను అరెస్టు చేశారు.

More Telugu News