: గంట వ్యవధిలో భారీ నష్టాల్లోకి...!

మధ్యాహ్నం రెండు గంటల వరకూ పడుతూ లేస్తూ క్రితం ముగింపుకు దగ్గర్లోనే సాగుతూ వచ్చిన సూచికలు, ఆపై ఒక్కసారిగా వెల్లువెత్తిన అమ్మకాల ఒత్తిడితో కుదేలయ్యాయి. గంట వ్యవధిలో 250 పాయింట్ల నష్టం సంభవించగా, భారత స్టాక్ మార్కెట్ ఒక శాతానికి పైగా నష్టపోయింది. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా వాటాలను విక్రయించినట్టు స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాలు వెల్లడించాయి. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 266.67 పాయింట్లు పడిపోయి 1.09 శాతం నష్టంతో 24,188.37 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 86.80 పాయింట్లు పడిపోయి 1.17 శాతం నష్టంతో 7,351.00 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 2.72 శాతం, స్మాల్ క్యాప్ 4.05 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 12 కంపెనీలు లాభాల్లో నడిచాయి. బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, ఆల్ట్రా సిమెంట్స్, హెచ్సీఎల్ టెక్, విప్రో తదితర కంపెనీలు లాభపడగా, కెయిర్న్ ఇండియా, వీఈడీఎల్, రిలయన్స్, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 91,42,335 కోట్లకు చేరింది. బీఎస్ఈలో మొత్తం 2,867 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 329 కంపెనీలు లాభాలను, 2,399 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News