: నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ... అయినా మెరిసిన స్మాల్, మిడ్ క్యాప్

ఆరంభంలో లాభాలు, ఆపై అరగంటకే నష్టాలు, మళ్లీ పావుగంటలో లాభం, ఆపై గంటకు నష్టం... తిరిగి లాభం, నష్టం... ఇలా రోలర్ కోస్టర్ లా సాగిన సూచికలు నష్టాలను కొనసాగించాయి. ఆసియా మార్కెట్లలో చైనా మినహా, మిగతా దేశాల సూచికలు నష్టాల్లో ఉండటం, యూరప్ మార్కెట్లలో కొనసాగిన అమ్మకాల ఒత్తిడి, నాస్ డాక్ క్రితం ముగింపు తదితరాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో చిన్న, మధ్యతరహా కంపెనీలు మెరిసాయి. స్మాల్, మిడ్ క్యాప్ సెక్టార్లు అర శాతానికి పైగా లాభపడ్డాయి. మంగళవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 43.01 పాయింట్లు పడిపోయి 0.17 శాతం నష్టంతో 25,580.34 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 6.65 పాయింట్లు పడిపోయి 0.09 శాతం నష్టంతో 7,784.65 పాయింట్ల వద్దకు చేరాయి. ఇక బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.56 శాతం, స్మాల్ క్యాప్ 0.79 శాతం లాభపడ్డాయి. ఎన్ఎస్ఈ-50లో 23 కంపెనీలు లాభాల్లో నడిచాయి. టాటా స్టీల్, వీఈడీఎల్, గెయిల్, ఆసియన్ పెయింట్స్, హిందాల్కో తదితర కంపెనీలు లాభపడగా, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, హిందుస్థాన్ యూనీలీవర్ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 99,70,679 కోట్లకు చేరింది. బీఎస్ఈలో మొత్తం 3,006 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 2,056 కంపెనీలు లాభాలను, 800 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News