: భారత ఐటీ కంపెనీలకు కష్టకాలం!

ఈ సంవత్సరంలో ఆదాయాలను పెంచుకోవడంలో విఫలమైన భారత ఐటీ కంపెనీలు, డిసెంబర్ తో ముగిసే త్రైమాసికంలో మరింత ఘోరమైన గణాంకాలను నమోదు చేయనున్నాయి. ప్రపంచ టెక్నాలజీ రంగంలో నూతన పెట్టుబడులు తగ్గడంతో పాటు చెన్నైని చుట్టుముట్టిన భారీ వరదలు, పలు నగరాల్లో కురిసిన వర్షాల కారణంగా ఆదాయం, లాభాలు గణనీయంగా తగ్గనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. దాదాపు 146 బిలియన్ డాలర్లకు విస్తరించిన భారత ఐటీ ఇండస్ట్రీలో, ఈ సంవత్సరం 12 నుంచి 14 శాతం వృద్ధి నమోదవుతుందని నాస్కామ్ అంచనా వేస్తుండగా, టీసీఎస్, ఇన్ఫోసిస్ సంస్థలు ఈ లక్ష్యాన్ని అందుకునే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ఆదాయ వృద్ధికి సంబంధించినంత వరకూ భారత ఐటీ సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అత్యంత కష్టకాలంగా కనిపిస్తోంది. దీంతో నాస్కామ్ సైతం వార్షిక వృద్ధి అంచనాలను తగ్గించుకోక తప్పేలా లేదు. "ఈ త్రైమాసికంలో టీసీఎస్ తదితర సంస్థల ఫలితాలు ఎలా ఉంటాయో చూసిన తరువాత అంచనాలు సవరిస్తాం" అని నాస్కామ్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. టాప్-5 కంపెనీల ఆదాయం 2 శాతం వరకూ తగ్గుతుందని బ్రోకరేజి సంస్థల అనలిస్టుల్లో అత్యధికులు అంచనా వేస్తున్నారు. కాగా, ఇప్పటికే విప్రో, టీసీఎస్ సంస్థలు తమ ఆదాయాలు తగ్గుతాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News