: నష్టాల్లో మార్కెట్లు ...రూ. 1.08 లక్షల కోట్లు ఆవిరి!

స్టాక్ మార్కెట్ నష్టం కొనసాగింది. ముడి చమురు ఉత్పత్తిని తగ్గించబోమని ఒపెక్ తీసుకున్న నిర్ణయం, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో అమెరికా మార్కెట్ నష్టపోయిన వేళ, ఆసియా మార్కెట్లలో కొనుగోలు సెంటిమెంట్ నశించగా, అదే దారిలో ఇండియా నడిచింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ 1.08 లక్షల కోట్లు తగ్గింది. మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 219.78 పాయింట్లు పడిపోయి 0.86 శాతం నష్టంతో 25,310.33 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 63.70 పాయింట్లు పడిపోయి 0.82 శాతం నష్టంతో 7,701.70 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.17 శాతం, స్మాల్ క్యాప్ 1.33 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 9 కంపెనీలు మాత్రమే లాభాల్లో నడిచాయి. హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, బోష్ లిమిటెడ్, టీసీఎస్, బజాజ్ ఆటో తదితర కంపెనీలు లాభపడగా, కెయిర్న్, గెయిల్, వీఈడీఎల్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ తదితర కంపెనీలు నష్టపోయాయి. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ సోమవారం నాడు రూ. 97,79,857 కోట్లుగా ఉండగా, అది రూ. 96,71,518 కోట్లకు తగ్గింది. మొత్తం 2,903 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 877 కంపెనీలు లాభాలను, 1,879 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి.

More Telugu News