: నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ఈక్విటీలను విక్రయించి లాభాలను స్వీకరించేవారు తప్ప, కొత్తగా కొనుగోలు చేసేవారు కనిపించకపోవడంతో భారత స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగాయి. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే నష్టాలు నమోదుకాగా, ఆపై మరే దశలోనూ సూచికలు కోలుకునేలా కనిపించలేదు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ కంపెనీలు, రిటైల్ ఇన్వెస్టర్లు విక్రయాలకే మొగ్గు చూపారు. దీంతో గురువారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 201.62 పాయింట్లు పడిపోయి 0.75 శాతం నష్టంతో 26,838.14 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 59.45 పాయింట్లు పడిపోయి 0.73 శాతం నష్టంతో 8,111.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.44 శాతం, స్మాల్ క్యాప్ 0.42 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో యస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, వీఈడీఎల్, లుపిన్, అల్ట్రా సిమెంట్స్ తదితర కంపెనీలు లాభపడగా, బీహెచ్ఈఎల్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, గెయిల్ తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 98,80,117 కోట్లుగా ఉంది. మొత్తం 2,850 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1224 కంపెనీలు లాభాలను, 1,438 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. మిగిలిన 188 కంపెనీల ఈక్విటీ ధరల్లో మార్పు నమోదు కాలేదు.

More Telugu News