: రెండు, మూడు వారాల్లో రూ. 29 వేలకు బంగారం ధర!

మూడేళ్ల తరువాత ఓ 'సంవాత్' సంవత్సరంలో (దీపావళి నుంచి నరక చతుర్దశి వరకు) బంగారం ధరల పెరుగుదల నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్‌ పెరగడం, వివిధ దేశాల కరెన్సీలతో డాలర్‌ మారకం విలువ తగ్గడం కారణాలతో ఈ దీపావళి నాటికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 29 వేలకు చేరవచ్చని బులియన్ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇదే ఆలోచనలతో స్టాకిస్టులు, ఆభరణాల తయారీదారులు మరింతగా కొనుగోళ్లు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఆగస్టు 6న పది గ్రాముల బంగారం అత్యంత కనిష్ఠస్థాయిలో రూ.24,850కు చేరింది. తిరిగి అమ్మకాలు వెల్లువెత్తడంతో పుంజుకుని రూ. 27 వేలను అధిగమించింది. ప్రస్తుతం సంవాత్ 2072 సంవత్సరం జరుగుతుండగా, అంతకుముందు సంవాత్ 2070 (నవంబర్ 3, 2013)తో పోలిస్తే, సంవాత్ 2071 (అక్టోబర్ 23, 2014) బంగారం విషయంలో 9.15 శాతం నష్టాన్ని చూపింది. ఇక అంతకుముందు సంవత్సరం 4.42 శాతం మేరకు ధరలు పడిపోయాయి. ఈ సంవత్సరం మాత్రం బంగారం లాభాన్ని అందించనుందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. భారత కరెన్సీ పతనం, పండగ సీజన్ కొనుగోళ్లు తదుపరి బంగారం కొనుగోలుకు అత్యంత శుభదినంగా భావించే ధన త్రయోదశి పర్వదినం రానుండటం వంటి కారణాలతో పుత్తడి ధర మరింత ఎత్తునకు చేరనుందని అంచనా వేశారు.

More Telugu News