: తూచ్, అలా అనలేదు... గంటల వ్యవధిలో మాట మార్చిన హర్యానా సీఎం

"ఈ దేశంలో ఉండాలని భావించే ముస్లింలు గోమాసం తినడాన్ని వదిలి వేయాలి" అని నిన్న ఓ జాతీయపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన హర్యానా సీఎం మోహన్ లాల్ ఖట్టర్, నేడు మాట మార్చారు. తాను అలా అనలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఖట్టర్ కార్యాలయం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. "హిందువుల మనోభావాలను గౌరవించాలి" అని మాత్రమే ఆయన వ్యాఖ్యానించినట్టు ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) జవహర్ యాదవ్ ఓ ప్రకటనలో తెలిపారు. "మా ముఖ్యమంత్రి అటువంటి వ్యాఖ్యలు చేయలేదు. నేడు ఆ దినపత్రికలో వచ్చిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నోటి ద్వారా వచ్చినవి కావు" అని ఆయన అన్నారు. కాగా, మోహన్ లాల్ వ్యాఖ్యల తరువాత దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు విరుచుకుపడ్డాయి. ఆయన నోటిని అదుపులో ఉంచుకోవాలని, ఈ తరహా వ్యాఖ్యలు మత సామరస్యాన్ని దెబ్బతీస్తాయని పలువురు విమర్శించడంతో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

More Telugu News