: వినూత్నంగా అమరావతి వేడుక... మూడు వేదికలు ఏర్పాటవుతున్న వైనం!

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లలో వినూత్నతకు పెద్ద పీట వేస్తోంది. ఇప్పటిదాకా లేని కొత్త సంప్రదాయానికి తెర తీస్తోంది. శంకుస్థాపన కార్యక్రమంలో మూడు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ప్రధాన వేదికగా ఏర్పాటవుతున్న డయాస్ పై ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా 15 మంది కీలక వ్యక్తులు ఆసీనులవుతారు. ఇక ఈ వేదికకు కాస్త దిగువగా మరో రెండు వేదికలు ఏర్పాటవుతున్నాయి. వీటిపై వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు ఆసీనులవుతారు. ఇక రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములిచ్చిన రైతుల కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైతులకు అందించనున్న ఆహ్వాన పత్రికలే వారికి ఎంట్రీ పాసులుగా పనిచేస్తాయని ఏపీ సర్కారు వర్గాలు పేర్కొన్నాయి. ఇక సేకరించిన మట్టి, నీరు కలశాలు అందరికీ కనిపించేలా ప్రదర్శిస్తారు.

More Telugu News