: ఇండియాలో పేదల సంఖ్య మాత్రమే ఎక్కువ... పేదరికం కాదు: వరల్డ్ బ్యాంక్

ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పేద ప్రజలున్న ఇండియాలో, మిగతా దేశాలతో పోలిస్తే పేదరికం రేటు అతి తక్కువగా ఉందని వరల్డ్ బ్యాంక్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక వివరాల ప్రకారం, 2015లో ప్రపంచంలో కడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారి సంఖ్య 10 శాతం కన్నా దిగువకు పడిపోయింది. అత్యధికంగా పేదలున్న దేశాల్లో, పేదరికం రేటు ఇండియాలో గణనీయంగా తగ్గుతోందని బ్యాంకు వెల్లడించింది. 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు ఇండియా ఎంతో సహకరిస్తోందని, తాము అంచనా వేస్తున్న లక్ష్యాలకన్నా ఇండియాలో పేదరికం తక్కువగానే ఉండివుండవచ్చని అభిప్రాయపడింది. అల్పాదాయ దేశాల్లో పేదరికం రేటు 43 శాతంగా, మధ్యాదాయ దేశాల్లో 19 శాతంగా ఉందని తెలిపింది. 2012లో అల్పాదాయ దేశాలుగా ఉన్న చైనా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా లు 2015లో దిగువ మధ్యాదాయ దేశాల జాబితాలోకి చేరాయని వివరించింది. ఈ దేశాల్లో ఇండియాలోనే పేదరికం రేటు తక్కువగా ఉందని తెలిపింది. గత కొద్ది సంవత్సరాలుగా విద్యా వ్యవస్థతో పాటు ఆరోగ్యం, సామాజిక భద్రత తదితరాంశాలు పేదరికాన్ని పారద్రోలేందుకు సహకరిస్తున్నాయని వివరించింది.

More Telugu News