: నాలుగు నెలలు కష్టపడి భారతీయ స్నేహితురాలిని కలుసుకున్న పాక్ యువతి

భారత్, పాకిస్థానీలలో సహజంగా ఉండే క్రికెట్ పిచ్చి ఓ ఇద్దరు యువతులను స్నేహితుల్ని చేసింది. కానీ తమవి వైరి దేశాలు కావడంతో న్యూయార్క్ లో మొదలైన వారి స్నేహం అక్కడే నిలిచిపోయింది. మళ్లీ సోషల్ మీడియా విస్తృతం కావడంతో స్నేహం ఆ విధంగా కంటిన్యూ అయింది. అయితే, ఒకరినొకరు కలుసుకోవాలని కోరుకుంటున్నా నిబంధనలు అడ్డుపడ్డాయి. ఈ క్రమంలో తమ ఇంట జరిగే వేడుకకు హాజరు కావాలంటూ సదరు పాక్ యువతి తన భారతీయ మిత్రురాలిని ఆమధ్య ఆహ్వానించినప్పటికీ వీసా సమస్యలతో ఆమె పాకిస్థాన్ వెళ్లలేకపోయింది. దీంతో స్నేహితురాలిని ఎలాగైనా కలుసుకోవాలని భారతీయ వీసా కోసం నాలుగు నెలలు కష్టపడిన పాక్ యువతి ఎట్టకేలకు ముంబై చేరి స్నేహితురాలిని కలుసుకుంది. సంతోషంలో మునిగిపోయిన వారిద్దరూ గత జ్ఞాపకాలు నెమరువేసుకోవడంలో మునిగిపోయారు. 2003లో న్యూయార్క్ లో ఓ స్నేహితుడి ద్వారా సదరు యువతి పరిచయమైందని పాక్ యువతి తెలిపింది. 'భౌగోళికంగా దగ్గరగా ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య వున్న రాజకీయ అంతరం తమను దూరం చేసింద'ని యువతి సోషల్ మీడియాలో వాపోయింది.

More Telugu News