: బట్టబయలైన 3 కోట్ల మంది వివాహేతర సంబంధాలు!

యాష్లే మాడిసన్... ప్రముఖ ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్. 'లైఫ్ ఈజ్ షార్ట్... హ్యావ్ ఏన్ అఫైర్' నినాదంతో ముందుకొచ్చిన ఈ సైట్ వివాహేతర సంబంధాలకు ప్రధాన వేదికగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 46 దేశాల్లో దూసుకుపోతున్న ఈ వెబ్ సైట్ కు 3 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. వీరంతా ఈ సైట్ ద్వారా తమకు కావాల్సిన పార్ట్ నర్ ను వెతుక్కుని వివాహేతర సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇంతవరకు బాగుంది... గత నెలలో ఈ సైట్ పై హ్యాకర్లు దాడి చేసి కస్టమర్ల వివరాలన్నింటినీ కొల్లగొట్టారు. అనంతరం, యాష్లే యాజమాన్యంతో బేరసారాలకు దిగారు. అయితే, బేరం కుదరక పోవడంతో సదరు హ్యాకర్లు విడతల వారీగా సమాచారాన్ని విడుదల చేయడం ప్రారంభించారు. ఎవరు ఎవరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనేదే ఈ సమాచారం. ఈ నేపథ్యంలో, యాష్లే యూజర్లలో దడ మొదలైంది. తమ బండారం ఎక్కడ బయటపడుతుందో... తన కుటుంబం ఎక్కడ నాశనం అవుతుంతో... సమాజంలో తమకున్న పరువు ఎక్కడ పోతుందో అనే వ్యధ మొదలైంది. ఈ టెన్షన్ భరించలేక ఇప్పటికే యూజర్లు ఒక్కొక్కరు ఆత్మహత్యలకు పాల్పడటం మొదలైంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందనే అంచనాలతో పలు దేశాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ప్రమాద తీవ్రతను పసిగట్టిన కెనడా పోలీసులు అమెరికాకు చెందిన ఎఫ్ బీఐ సహకారంతో హ్యాకర్లను గుర్తించే పనిలో పడ్డారు. ఇదే సమయంలో, యాష్లే మాడిసన్ యాజమాన్యం కూడా... హ్యాకర్లకు సంబంధించిన వివరాలను తెలిపితే రెండున్నర కోట్ల రూపాయలు ఇస్తామని ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుందో వేచి చూడాలి.

More Telugu News