: రోజుకో స్పూన్ తేనె తాగితే... ఇన్ని లాభాలు!

బంగారు వర్ణంలో మెరుస్తూ, సుమధురంగా ఉండే తేనెను రోజుకో స్పూను తాగితే, ఎన్నో లాభాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. తేనెపట్టు నుంచి సేకరించే తేనె మానవాళికి వేలాది సంవత్సరాలుగా ఉపయోగపడుతూనే ఉంది. ఎన్నో ఔషధాల్లో వినియోగిస్తున్న తేనెను రోజూ స్వీకరిస్తే కలిగే లాభాలివి... తేనెను తాగడం వల్ల క్యాన్సర్ తో పాటు, గుండె జబ్బుల ప్రమాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనెలోని ఫ్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని రకాల క్యాన్సర్లను పూర్తిగా నివారిస్తాయి. అంతేకాదు, అల్సర్ తదితర గ్యాస్ సంబంధిత రోగాలను తగ్గిస్తాయట. తేనెటీగలు తాము సేకరించిన తేనెపై హైడ్రోజన్ పెరాక్సైడ్ ను తయారు చేసే ఎంజైమును కలుపుతాయి కాబట్టి తేనె యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేస్తుంది. తేనెను ఆహారంగా తీసుకోవడం ద్వారా అథ్లెట్లలో సామర్థ్యం మరింతగా పెరుగుతుందట. గతంలో ఒలింపిక్ ఆటగాళ్లు తేనెనే ఆహారంగా తీసుకునేవారని చరిత్రకారులు వెల్లడించగా, ఆధునిక అధ్యయనాలు సైతం తేనె వల్ల అటగాళ్ల సామర్థ్యం పెరగడం వాస్తవమేనని తేల్చారు. తేనె దగ్గు, గొంతు నొప్పి వంటి వాటిని దూరం చేస్తుంది కూడా. 100 మంది చిన్నారులపై జరిగిన పరీక్షల్లో భాగంగా ఒక సింగల్ డోస్ తేనె, అంతే మొత్తం డెక్స్ ట్రోమెథోర్ఫాన్ డోసుతో సమానమని తేల్చారు. వీటితో పాటు మంచి నిద్రకు కూడా తేనె ఉపకరిస్తుంది. శరీరంలో హార్మోన్ల సమతుల్యానికి, కంటి చూపు మెరుగునకు, బరువు నియంత్రణకు, మూత్రనాళ సంబంధ రుగ్మతలను, ఆస్తమాను దూరం చేసేందుకు సహాయ పడుతుంది. అంతేకాదు, మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచడం, ప్రమాదాల్లో గాయాలు తగిలినప్పుడు, కాలిన గాయాలు అయినప్పుడు, అవి త్వరగా నయం కావడానికి, శరీరంలో స్నేహపూర్వక బ్యాక్టీరియాను పెంచేందుకు, చర్మం మరింత ఆకర్షణీయంగా, అందంగా కనిపించేలా చేయడంలోనూ తేనె సహకరిస్తుందని విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు.

More Telugu News