: నిప్పులు కక్కుతూ నింగికెగసిన పీఎస్ఎల్వీ-సీ 28

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించే ప్రయోగం చేసింది. ఈ రాత్రి 9:58 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ28 రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించింది. వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ఇస్రో విజయవంతంగా పంపింది. పీఎస్ఎల్వీ-సీ28 వాహక నౌక ద్వారా శాస్త్రవేత్తలు ఒకేసారి ఐదు విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) ఈ అద్భుతానికి వేదికగా నిలిచింది. గతంలో చంద్రయాన్-1, మార్స్ ఆర్బిటర్ మిషన్ లను ప్రయోగించిన సందర్భంగా వినియోగించిన ఎక్స్ఎల్ రకం వాహకనౌకను ఈసారి కూడా ఇస్రో వినియోగించడం విశేషం. రాకెట్ ను అంతరిక్షంలోకి పంపిన శాస్త్రవేత్తలు దాని సవ్యదిశను లెక్కిస్తున్నారు. తొలి దశను విజయవంతంగా అధిగమించిన పీఎస్ఎల్వీ-సీ28, రెండో దశను కూడా విజయవంతంగా అధిగమించింది. రాకెట్ నింగికెగసిన 19.16 నిమిషాలకు చివరి ఉపగ్రహం విడిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, పీఎస్ఎల్వీ-సీ28 ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్న ఐదు ఉపగ్రహాల్లో మూడు డీఎంసీ3 ఆప్టికల్ భూ పరిశీలన ఉపగ్రహాలు కాగా, రెండు చిన్నసైజు ఉపగ్రహాలైన ఆర్బిట్ సెయిల్ సీబీఎన్టీ-1, డి ఉపగ్రహాలు. ఈ కార్యక్రమానికి పలువురు శాస్త్రవేత్తలు, ఇస్రో ఛైర్మన్ హాజరయ్యారు.

More Telugu News