: డేటింగ్ యాప్ లతో సరైన భాగస్వామి దొరికేనా?

డేటింగ్ యాప్స్... యువతీ యువకులను కలిపే సామాజిక మాధ్యమ వేదికలు. ఆధునిక 'మ్యాచ్ మేకింగ్' సేవలను ఈ యాప్స్ అందిస్తున్నాయి. అసలు ఇండియాలో 'డేటింగ్ యాప్స్'లేవని ఈ తరహా యాప్స్ సృష్టించిన వారే అంటున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చేవారే అత్యధికులు ఉండడంతో ఈ యాప్స్ అంతగా ప్రాచుర్యం పొందలేదని 'వూ' వ్యవస్థాపకుడు సుమేష్ మీనన్, 'వీ' సృష్టికర్త నితిన్ గుప్తా, 'ట్రూలీ మాడ్లీ' వెనకున్న రాహుల్ కుమార్ తదితరులు అభిప్రాయపడుతున్నారు. వీటితో పాటు 'హుకప్ యాప్', 'టిండర్' తదితర ఎన్నో యాప్స్ స్మార్ట్ ఫోన్లలో డేటింగ్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని యాప్స్ మెసేజ్ లు చేసుకునేందుకు, మరికొన్ని సీరియస్ గా భాగస్వాములను వెతికి పట్టుకునేందుకు ఉపకరిస్తున్నాయని సుమేష్ అభిప్రాయపడ్డారు. ఈ విషయం యాప్స్ వాడుతున్న వారికి మాత్రమే తెలుస్తుందని ఆయన వివరించారు. 'టిండర్' యాప్ నడిపిస్తున్న విధానం, దాని వెనకున్న ఆలోచన తనకు నచ్చాయని, కానీ వాస్తవానికి ఫలితాలు సరైనవి రావడం లేదని, వీటి వాడకం ద్వారా ఒక్క వ్యక్తిని కూడా తాను కలుసుకోలేదని ఢిల్లీ న్యాయవాది నుపుర్ యాదవ్ తెలిపారు. తనకు వివాహం చేయాలని భావించిన తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితమే భారత్ మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ సృష్టించారని తెలిపిన ఆమె, మూడేళ్ల పాటు వెతికి వారు విఫలమయ్యారని తెలిపారు. తాను సరైన భాగస్వామి కోసం వెతుకుతుంటే, తాత్కాలిక పరిచయాలు, సంబంధాల కోసం చూస్తున్నవారే అధికంగా ఉన్నారని ఆమె వాపోయారు. గంటల తరబడి వెతికివెతికి తాను అలసిపోయానని తెలిపారు. ఇది నుపుర్ తో పాటు డేటింగ్ సైట్స్ ల వెంట తిరుగుతున్న ఎంతో మంది సమస్యగా మారింది. అయితే, సంప్రదాయ వివాహ వెబ్ సైట్లతో పోలిస్తే మరిన్ని సేవలను మాత్రం అందిస్తున్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు. చాలా యాప్స్ 'ఉమెన్ ఫస్ట్' విధానంలో పనిచేస్తుండటం కూడా వీటి వైఫల్యానికి కారణంగా తెలుస్తోంది. తాత్కాలిక డేటింగ్ కోసమైతే ఓకేగానీ, జీవిత భాగస్వామిని వెతకడంలో మాత్రం వీటిని వాడకపోవడమే మంచిదన్నది నిపుణుల సలహా.

More Telugu News