: మధుమేహాన్ని జయించాలనుకుంటున్నారా?

వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా ఎంతోమంది డయాబెటిస్ బారినపడుతున్నారు. పని ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లలో మార్పులు, నిద్రలేమి, జన్యువులు... ఇలా మధుమేహానికి ఎన్నో కారణాలు. ఒక్కసారి 'షుగర్' ఉందని తేలితే, ఇక జీవితకాలం మందులు వాడాల్సిందే. లేకపోతే చాపకింద నీరులా శరీరంలోని కీలక భాగాలను దెబ్బతీసి, ప్రాణాలను హరించివేస్తుంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా, ఈస్టర్న్ ఫిన్లాండ్ యూనివర్శిటీ పరిశోధకులు ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. కోడిగుడ్లు తినడం ద్వారా డయాబెటిస్ ను జయించవచ్చని అంటున్నారు. వారానికి నాలుగు గుడ్లు తింటే మధుమేహం ముప్పు తగ్గుతుందని తెలిపారు. హై కొలెస్ట్రాల్ కలిగి ఉండే గుడ్లు టైప్ 2 డయాబెటిస్ ముప్పును దాదాపు 40 శాతం తగ్గిస్తాయని వివరించారు. 2,332 మంది మధ్య వయస్కుల ఆహార అలవాట్లను పరిశీలించి తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. వారానికి నాలుగు గుడ్లు తినేవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయట. అంతేగాదు, కొలెస్ట్రాల్ కూడా పెద్దగా పెరగదని ఫిన్నిష్ వర్శిటీ పరిశోధకులంటున్నారు. అయితే, వారానికి నాలుగు గుడ్ల కంటే ఎక్కువగా తింటే మిక్కిలి ప్రభావం కనిపిస్తుందని భావించరాదని కూడా వారు తెలిపారు.

More Telugu News