: భూకంపాలను జంతువులు ముందుగానే గుర్తిస్తాయని తేల్చిన బ్రిటన్ పరిశోధకుడు

భూకంపాలను జంతువులు ముందుగానే పసిగడతాయని పెద్దలు చెబుతుండేవారు. కానీ, దీని శాస్త్రీయతపై పలు అనుమానాలు వ్యక్తమయ్యేవి. తాజాగా బ్రిటన్ లోని రస్కిన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాచెల్ గ్రాంట్ ఈ విషయాన్ని నిరూపించారు. పెరూలోని యనచాగ జాతీయ పార్క్ లో ఏర్పాటు చేసిన కెమెరాల్లో నిక్షిప్తమైన సమాచారంతో ఆయన ఈ విషయాన్ని నిరూపించారు. పెరూలోని కాంటమానాలో 2011లో పెను భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7 గా నమోదైంది. ఈ భూకంపానికి 23 రోజుల ముందునుంచి జంతువుల ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. సరిగ్గా 15 రోజుల ముందు వాటిలో కలకలం రేగింది. భూకంపానికి ఐదు రోజుల ముందు అవి ఎలాంటి కదలికలు లేకుండా స్తబ్దుగా ఉండిపోయాయట. భూకంపానికి ముందు, భూ పొరల్లో ఏర్పడిన కదలికల వల్ల భూఉపరితల వాతావరణంలోని గాలిలోని అయాన్లలో చలనం ఏర్పడుతుంది. దీనివల్ల జంతువులపై సెరొటోనియం సిండ్రోమ్ ప్రభావం కలుగుతుంది. అంటే రక్త ప్రసారంలో సెరొటోన్ల స్థాయి హఠాత్తుగా పెరుగుతుంది. అది పెరగడం వల్ల జంతువుల శరీరంలో అలసట, గుండెలో తెలియని గుబులు, అర్ధం కాని మానసిక ఆందోళన కలుగుతాయని ఆయన చెప్పారు. అందువల్ల జంతువుల ప్రవర్తనలో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పులు బొరియల్లో నివసించే జంతువులు, క్షీరదాలు, పక్షుల్లో ఎక్కువగా కనిపిస్తాయని ఆయన తెలిపారు. జంతువులను గమనించిడం ద్వారా భూకంపాలు గుర్తించవచ్చని ఆయన వెల్లడించారు.

More Telugu News