: తెలుగు మట్టే అక్కడ పూజ్యనీయం

తాత తండ్రుల నాడు జన్మభూమి నుంచి తెచ్చిన పిడికెడు మట్టిని అక్కడ పూజిస్తారు. తెలుగు భాష మాట్లాడడానికే సిగ్గుపడుతున్న ప్రస్తుత తరంలో తమిళనాడులోని ఛత్తిరపట్టి గ్రామీణులను చూసి ఎంతైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మాతృభాషా దినోత్సవమంటేనే నేటి యువతకు తెలియదు. అలాంటి తరుణంలో అక్కడి వారు తెలుగు భాష కోసం, తెలుగు మట్టి కోసం ఎంతో తాపత్రయపడుతున్నారు. తమిళభాషను అధికారికంగా వినియోగిస్తున్నప్పటికీ తరాలుగా తెలుగు భాషనే ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. తమిళవాసనలతో గుబాళించే తెలుగులో ఆట, పాటలు, వేడుకలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి తెలుగు పండగనూ వైభవంగా జరుపుకుంటారు. 2000 మంది వరకు ఉండే ఆ గ్రామంలో తెలుగు రానివారు లేరంటే అతిశయోక్తి కాదు. కుటుంబాల్లో పిల్లలకు తెలుగు కథలు, పాటలు వినిపిస్తారు. తెలుగు భాషను విధిగా ఇంట్లో మాట్లాడుతూ, తల్లి నేలను ప్రతిక్షణం గుర్తుచేసుకుంటారు. తిరుపతిలోని వెంకటేశ్వరస్వామిని ప్రతిఏటా పూజించుకుని తల్లినేలను ముట్టుకోవడం అక్కడి వారికి ఎంతో ఆనందం. అక్కడ ప్రతి పెద్దా చెప్పే మాట ఒకటుంటుంది. అది ఏంటంటే...'బయట ఏదయినా మాట్లాడండి, కానీ ఇంట్లో మాత్రం తెలుగులోనే మాట్లాడండి, తల్లి నేలను, మాతృభాషను మర్చిపోతే జన్మనిచ్చిన వారిని మర్చిపోయినట్టే'.

More Telugu News