: తప్పు చెప్పిన భారతీయుడికి 7 లక్షల బహుమతి అందజేసిన ఫేస్ బుక్

ఫేస్ బుక్ అకౌంట్లలోంచి ఫొటోలను డిలీట్ చేసే బగ్ ను కనుగొన్న భారతీయుడికి ఫేస్ బుక్ బహుమతి అందజేసింది. లక్ష్మణ్ ముత్తయ్య అనే యువకుడికి ఫేస్ బుక్ యాజమాన్యం 7.77 లక్షల రూపాయల బహుమతిని అందజేసింది. కొద్దిపాటి సాంకేతిక పరిజ్ఞానం తెలిసున్నవాళ్లు ఎవరైనా కూడా ఫేస్ బుక్ లో అప్ లోడ్ అయిన ఎలాంటి ఫొటోలనైనా డిలీట్ చేసేలా ఉన్న ఓ బగ్ ను ముత్తయ్య గుర్తించాడు. దాని గురించి తన బ్లాగులో సవివరంగా ఫేస్ బుక్ వినియోగదారులను హెచ్చరిస్తూ ఓ వ్యాసం రాశాడు. అది పోస్టయిన కాసేపట్లోనే ఫేస్ బుక్ సరిచేసింది. వేరే ఎవరివో ఫొటో ఆల్బంలను డిలీట్ చేయడానికి గ్రాఫ్ ఏపీఐకి రిక్వెస్టు పంపితే, దానిని ఫేస్బుక్ ఆమోదించి, ఆల్బం మొత్తాన్ని డిలీట్ చేసేస్తుందని ముత్తయ్య వెల్లడించాడు. ఫేస్ బుక్ ఆల్బం ఐడీలు అంకెల్లో ఉంటాయని, దీంతో ఆ అంకెలను ఊహించడం చాలా సులువైపోతుందని, దాని కారణంగానే మనకు తెలియని వారి ఆల్బంలను కూడా డిలీట్ చేసేయొచ్చని ఐటీ సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ తెలిపింది. కాగా, ఈ బగ్ కేవలం పబ్లిక్ ఆల్బంలను మాత్రమే నాశనం చేస్తోందని, పర్సనల్ ఆల్బంలకు వర్తించదని ఫేస్ బుక్ చెబుతోంది. ఈ బగ్ ను కనుగొన్నందుకు ముత్తయ్యకు 7.77 లక్షల రూపాయలు ఫేస్ బుక్ అందజేసింది.

More Telugu News