: ఢిల్లీ-ముంబయి రైల్వే ట్రాక్ పై 'లొట్టిపిట్ట' హల్ చల్

రాజస్థాన్ ఒంటెలకు ప్రసిద్ధి. ఈ జంతువు లొట్టిపిట్టగానూ ప్రాచుర్యంలో ఉంది. తాజాగా ఈ రాష్ట్ర జంతువు ఏం చేసిందో చూడండి. ఢిల్లీ-ముంబయి రైలు మార్గంలో పలు రైళ్ళ రాకపోకలకు అంతరాయం కలిగించింది. రాజస్థాన్ లోని కరౌలీ జిల్లాలోని హిందౌన్ పట్టణం వద్ద పట్టాలపై తిష్ఠ వేసింది. దీంతో, సుమారు మూడు గంటలపాటు రైళ్ళు నిలిచిపోయాయి. గత శనివారం జరిగిందీ ఘటన. ఆ రోజు ఉదయం తొలుత ఓ గూడ్సు రైలు రాగా, పట్టాలపై ఉన్న ఈ ఒంటె పక్కకు జరగడంతో ఆ రైలు వెళ్ళిపోయింది. అనంతరం మళ్ళీ పట్టాలెక్కి పడుకుంది. ఈసారి అమృత్ సర్-ముంబయి ఎక్స్ ప్రెస్ వచ్చింది. లొట్టిపిట్టను గమనించిన రైలు డ్రైవర్లు హారన్ మోగించినా ఫలితం లేకపోయింది. వారు పరిస్థితిని హిందౌన్ స్టేషన్ మాస్టర్ కు తెలిపారు. దీంతో, ఆయన సమీపంలో ఉన్న రైళ్ళన్నీ నిదానంగా నడపాలని, ఐదు కిలోమీటర్ల వేగం దాటరాదని సూచించారు. ఇక్కడింత జరుగుతుంటే... ఆ ఒంటె అప్ ట్రాక్ పై నుంచి లేచి డౌన్ ట్రాక్ పై పడుకుంది. దీంతో, పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. మొత్తమ్మీద ఎనిమిది రైళ్ళు దీని కారణంగా నిలిచిపోయాయట. చివరికా జంతువు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రైల్వే వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

More Telugu News