: ప్రియురాలిని, ఆమె తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ప్రేమోన్మాది

'ప్రేమిస్తున్నా, నువ్వూ ప్రేమించాలి... ప్రేమించకపోతే చంపేస్తా' అంటూ ఓ నలుగురు స్నేహితులతో వచ్చి ఎవరో ఒకరు బెదిరింపులకు దిగడం... వారికి స్నేహితులో, కుటుంబమో, సామాజిక నేపథ్యమో అండగా నిలబడడంతో ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటనే నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఓజిలిమండలం నెమళ్లపూడికి చెందిన ఓ విద్యార్థిని నెల్లూరులోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ నరేష్ ఆటోలో రోజూ కళాశాలకు వచ్చివెళ్లేది. దీనిని అలుసుగా తీసుకున్న నరేష్ ప్రేమ పేరుతో వేధించేవాడు. ఈ విషయాన్ని యువతి ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లడంతో నరేష్ ను మందలించి వదిలేశారు. దీంతో కొంతకాలం సైలెంట్ గా ఉన్న నరేష్ మూడు నెలల క్రితం ఆ విద్యార్థినిని ఆటోలో కిడ్నాప్ చేశాడు. ఆ సందర్భంగా ఆమె అపస్మారక స్థితికి చేరుకోవడంతో అసభ్యకరమైన రీతిలో ఆమెతో ఫొటోలు దిగాడు. అతని ఆగడాలు భరించలేని యువతి తల్లిదండ్రులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నరేష్ తల్లిదండ్రులను పిలిపించి ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే సరికాదని మందలించి వదిలేశారు. దీంతో గతంలో తీసిన ఫొటోలతో బ్లాక్ మెయిలింగ్ కి దిగాడు నరేష్. దీనిని భరించలేని యువతి కుటుంబం గ్రామం వదిలి నాయుడుపేటకు షిఫ్ట్ అయింది. దీంతో రాత్రి కొంతమంది యువకులతో ఆమె ఉంటున్న ప్రాంతానికి వచ్చి నానాబీభత్సం సృష్టించాడు. నేను ప్రేమిస్తున్నా... నన్ను ప్రేమించకపోతే చంపేస్తానంటూ ఆమె కుటుంబ సభ్యులపై దాడికి యత్నించాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News